అనివార్య పరిస్థితులు తలెత్తితే వై ఎస్ భారతి ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల కు రాజ్య సభ టిక్కెట్ ఇస్తారనే సమాచారం బలంగా వినిపిస్తున్నది. వైఎస్ జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీ బాధ్యతలను తన భుజాలపై వేసుకుని ఓదార్పు యాత్ర కొనసాగించిన షర్మిల పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనిపించలేదు. జగనన్న వస్తున్నాడు అనే ధైర్యాన్ని ప్రజల్లో కల్పించగలిగిన షర్మిల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ప్రచారం చేయలేదు.
అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలుగు సీట్లు దక్కనున్నాయి. ఈ నాలుగు స్థానాలలో ఒకటి షర్మిలకు ఇస్తే ఎవరూ అభ్యంతర పెట్టే పరిస్థితి ఉండదు. పైగా ఢిల్లీలో కార్యభారంతో ఉన్న విజయసాయి రెడ్డికి కొంత భారాన్ని తగ్గించడానికి వీలుకలుగుతుంది. ఈ కారణాల నేపథ్యంలో షర్మిల ను రాజ్యసభ కు పంపడం ఖాయమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి.