హిందువులు అతి పవిత్రంగా భావించే రుద్రాక్షలు ఎక్కడ పండుతాయి? ఎక్కడేమిటి నేపాల్ దేశంలో అంటారా? కచ్చితంగా మీరు తప్పు చెప్పినట్లే. రుద్రాక్షలు హైదరాబాద్ శివారులోని మేడ్చల్ జిల్లా దుండిగల్ లో కూడా పండుతాయి.
సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన కు అక్కడ ఒక వ్యవసాయ క్షేత్రం ఉంది. ఆ వ్యవసాయ క్షేత్రం పేరు విమలా దేవి వ్యవసాయ క్షేత్రం. అందులో ఎన్నో రకాల అరుదైన మొక్కల్ని పెంచుతున్నారు. ఏడెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ వ్యవసాయ క్షేత్రంలో నేపాల్ దేశంలో పండే రుద్రాక్ష పండుతోంది.
పదేళ్ల కింద నాటిన రుద్రాక్ష మొక్కకు సంవత్సరానికి పది కిలోల రుద్రాక్షలు కాస్తున్నాయి. నేపాల్ లో సైతం చాలా తక్కువగా కాసే ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, పంచముఖి రుద్రాక్షలను పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు. కేరళలో పండే దాల్చిన చెక్క మొక్క ఏపుగా పెరిగింది.
ఉత్తరాది రాష్ట్రాల్లో పండే లిచీ చెట్టుకు ఏడాదికి పదిహేను కిలోల వరకు లిచీ పండ్లు కాస్తున్నాయి. ఇక లవంగాలు…ఇలాచీ…బిర్యానీ ఆకు…డ్రాగన్ ఫ్రూట్…ఆవకాడ…స్టార్ ఫ్రూట్ లాంటి అరుదైన మొక్కల్ని అక్కడ పెంచుతున్నారు. దేశంలో పండే 73 రకాల మామిడి పండ్లను నాటి తెలంగాణ భూముల్లో అన్ని చెట్లను నాటి పంటను తీయొచ్చని కాట్రగడ్డ ప్రసూన నిరూపిస్తున్నారు.