సినీ పరిశ్రమ లో పెను విషాదం చోటు చేసుకుంది. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) కన్నుమూశారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డ ఆయన శుక్రవారం మధ్యాహ్నాం వెంటిలేటర్పైనే తుది శ్వాస విడిచారు.
ఆయన మధ్యాహ్నం 1.04కు తుది శ్వాస తీసుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో వస్తాడనుకున్న అభిమానులను శోకసంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాలకు బాలు వెళ్లిపోయారు.
బాలు మరణించినట్లు ఆయన కుమారుడు చరణ్ మీడియా ముందు ధృవీకరించారు. ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు.
50 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్న ఆయన మృతి చెందడం పట్ల దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
చెన్నైలోని మౌంట్రోడ్డులోని సత్యం థియేటర్ వద్దకు బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయం తరలించే అవకాశం ఉంది.