లాక్ డౌన్ సమయంలో కరోనా ఎక్కడ వస్తుందోనని నోటికి మూతికి బట్టలు కట్టుకుని బతుకుతున్న ఈ ప్రపంచంలో అన్నీ మర్చిపోయి అడవి బిడ్డల ఆకలి తీర్చడమే లక్ష్యంగా పని చేస్తున్న వారెవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నకు మా సీతక్క ఉన్నదని అత్యంత నమ్మకంతో, విశ్వాసంతో చెప్పవచ్చు.
ఉమ్మడి వరంగల్ జిల్లలోని ములుగు నియోజకవర్గంలో 7వందలకు పైగా పల్లెలుండగా ఇప్పటి వరకు ఆమె 320 గ్రామాల్లో పర్యటించింది. ఊరికే ఉత్త చేతులతో వెళ్లి వాళ్ల తిండి తిని రావడం కాదు. బియ్యం, కూరగాయలు, నూనె, పప్పుదినుసులు ఇలా 15 రోజులకు సరిపడేలా నిత్యావసరాలను తీసుకెళ్లి అడవి బిడ్డలకు అందిస్తున్న నిజమైన ప్రజాసేవకురాలు సీతక్క.
రవాణా సౌకర్యం సరిగాలేని గిరిజన ప్రాంతాలకు సరకులను ఎడ్ల బండ్లలో, ట్రాక్టర్లలో, అవసరమైతే భుజాల మీద మోస్తూ తీసుకువెళ్లి, ప్రజలకు అందిస్తున్నారు. కరోనా పట్ల అవగాహన తక్కువగా ఉండే గిరిజనగూడాల్లో…. వైరస్ వ్యాప్తిపై తెలియజేస్తూ…. మాస్కులు పంపిణీ చేస్తున్నారు.
చిన్నపిల్లలు, మహిళలకు పౌష్ఠికాహారం, అప్రమత్త చర్యలను తెలియజేస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటిస్తున్న క్రమంలో… ఆమె నిరాడంబరత, పేదలపై చూపించే ఆప్యాయత ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. గిరిజనగ్రామాల పర్యటనలో చెలిమల్లో దప్పిక తీర్చుకుంటూ…. అడవుల్లోనే సేదతీరుతున్నది సీతక్క.
ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు కొందరు ప్రజలను పట్టించుకోరు. ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకు వస్తారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో బట్టలు నలగకుండా ఏసి కార్లలో వచ్చి పాల్గొని వెళతారు. ఇది అందరికి తెలిసిన నగ్న సత్యం. కాని సీతక్క మాత్రం ప్రజల్లోనే పుట్టింది, ప్రజల్లోనే ఉంటోంది.
మరీ ఈ కష్ట సమయంలో ఆమె ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోవడం లేదు, పసిబిడ్డను కంటికి రెప్పలా కాపాడే తల్లిలా. ఒకప్పుడు ప్రజల్లో అక్కగా.. అండగా నిలబడి పోరాటాల్లో పాల్గొన్న ధనసరి అనసూయ ఎలియాస్ సీతక్క అవిశ్రాంత పోరాటం ఇది. ఆమె నియోజక వర్గం మొత్తం అటవీ ప్రాంతమే..
ఒక్కొ గ్రామానికి వెళ్ళాలంటే కిలో మీటర్ల కొద్ది నడవాల్సిందే. వాగులు, వంకలు, కొండలు, గుట్టలు దాటి వెళ్ళాల్సిందే. కనీసం నడక బాటకూడా లేని పరిస్థితి. అలాంటి ప్రదేశాలకు సీతక్క పర్యటిస్తూ.. అక్కడి ప్రజలకు తనకు చేతనైనంత సహాయం చేస్తున్నారు.
అక్కడ కోయ, గోండు, మరియు లంబాడీ లాంటి ఆదివాసీ జాతులు ఎక్కువగా నివసిస్తుంటారు. అడవి ప్రాంతం కాబట్టి కొన్ని చోట్లకి కనీసం రోడ్లు కూడా ఉండకపోవడంతో రవాణా సౌకర్యం ఉండదు. అలాంటి ప్రాంతాలకు నిత్యావసర సరుకులు చేరవేస్తూ ప్రతి పేదవాడి కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు సీతక్క.
అడవి బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీతక్క పేదల ఆకలి తీర్చేందుకు ‘గో హంగర్ గో’ పేరుతో ఛాలెంజ్ విసిరారు. లాక్డౌన్ కారణంగా తన నియోజకవర్గంలో తిప్పలు పడుతున్న ప్రజల కోసం ఆమె చేస్తున్న కృషి…. ప్రజాప్రతినిధి అన్న పదానికి సరైన నిర్వచనంగా నిలుస్తోంది.
మండుటెండను సైతం లెక్కచేయకుండా…. కొండలు, కోనల్లో కాలినడకన, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లలో గిరిజన ప్రాంతాలకు వెళ్తూ…. నిత్యావసర సరకులను అందిస్తున్నారు. రాత్రింబవళ్లు గుత్తికోయల గూడాల్లో పర్యటిస్తూ… ప్రజల్లో భరోసా నింపుతున్నారు. సీతక్కకు సత్యం న్యూస్ సలామ్.