కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య మెజారిటీతో గెలవడం తెలంగాణలోని ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం పెల్లుబికింది. తాజా రిజల్టుతో తెలంగాణలోనూ తమ పార్టీ గెలుపు ఖాయమనే జోష్ శ్రేణుల్లో నెలకొన్నది. రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అంటూ చెప్పుకుంటున్న నేతలకు రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సవాలుగా మారాయి.
సీనియర్-జూనియర్ తేడా లేకుండా సమిష్టి కృషితో పనిచేసినందువల్లనే విజయం సాధించామని కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. అదే స్ఫూర్తి తెలంగాణలో సాధ్యమవుతుందా అనే చర్చ తెలంగాణ పాలిటిక్స్ లో మొదలైంది. టీ-కాంగ్ గ్రూపు తగాదాలు, వర్గ పోరు లాంటివన్నీ పక్కన పెట్టి కర్నాటక తరహాలోనే తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఒక్కటవుతారా అనేది కీలకంగా మారింది.
అన్ని స్థాయిల లీడర్లను ఒక్కటి చేయడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ తెలంగాణలో ఎలాంటి ఫార్ములాను అనుసరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీని గెలిపించడానికి అన్ని వర్గాలను ఏకం చేయడం సాధ్యమేనా అనే సందేహం ఉన్నా ఆ చొరవ తీసుకునేదెవరనేది మింగుడుపడడంలేదు.
అందరినీ కలుపుకుపోగలిగే నాయకులెవరన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక ప్రచారం చేయడం కలిసొచ్చిందని, ఈ విజయం వారికే అంకితమంటూ డీకే శివకుమార్ వ్యాఖ్యానించగా, కాబోయే ప్రధాని రాహుల్గాంధీయే అంటూ మాజీ సీఎం సిద్ధరామయ్య కామెంట్ చేశారు. ఈ గెలుపు జాతీయ నాయకులదేననే అభిప్రాయాన్ని కర్నాటక కాంగ్రెస్ నేతలు పలువురు పేర్కొన్నారు.