తమిళనాడులోని కోయంబత్తూరులో యువకుడి హత్య కేసులో నిందితులను పోలీసులు సినీ ఫక్కీలో అరెస్టు చేశారు. నిందితులు పోలీసులను మభ్యపెట్టి కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపి మరీ అరెస్టు చేశారని నగర పోలీస్ కమిషనర్ వి బాలకృష్ణన్ తెలిపారు. వారిని పట్టుకునే క్రమంలో పోలీసులపై దాడి చేయగా, పోలీసులు వారిపై కాల్పులు జరపడంతో నిందితుడి కాలుకు బుల్లెట్ తగిలింది.
మెట్టుపాళయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. సోమవారం జిల్లా కోర్టు సముదాయం సమీపంలో గోకుల్ అనే యువకుడిని ఐదుగురు సభ్యుల ముఠా హత్య చేసిందని నగర పోలీసు కమిషనర్ వి.బాలకృష్ణన్ తెలిపారు. ఘటన జరిగిన సమయంలో గోకుల్ తన స్నేహితుడు మనోజ్తో కలిసి తనపై ఉన్న కేసు విచారణకు హాజరయ్యేందుకు వచ్చాడు. అనంతరం మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందం నీలగిరి జిల్లా కోటగిరి వద్ద నిందితులను కనిపెట్టింది.
అనంతరం మంగళవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత ఐదుగురు నిందితులను కోటగిరి నుంచి నగరానికి తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. అప్పుడే నిందితుల్లో ఇద్దరు జాషువా, గౌతమ్ వాంతులు చేసుకుంటున్నారని కారు ఆపారు. కారు దిగిన తర్వాత పోలీసులు వెంబడించడంతో ఇద్దరూ పారిపోయేందుకు ప్రయత్నించగా, దాచిన కొడవలితో పోలీసులపై దాడి చేశారు. ఇందులో ఓ పోలీసు చేతికి గాయమైంది. ఆ తర్వాత ఆత్మరక్షణ కోసం టీమ్లోని సబ్ ఇన్స్పెక్టర్ ఇద్దరిపై కాల్పులు జరిపాడని బాలకృష్ణన్ తెలిపారు.
నిందితులిద్దరి కాళ్లకు బుల్లెట్ తగిలింది. ఇద్దరికీ మెట్టుపాళయం ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, తదుపరి చికిత్స కోసం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన నిందితుల నుంచి అందిన సమాచారం మేరకు హత్యకు పాల్పడిన మరో ఇద్దరిని కూడా పట్టుకున్నారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. హత్యకు గల కారణాలేమిటని బాలకృష్ణను ప్రశ్నించగా.. సమగ్ర విచారణ తర్వాతే తెలుస్తుందని.. నిందితులను మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామని చెప్పారు.