తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాలలో ఖాళీగా ఉన్న ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగుల బ్యాక్ లాక్ పోస్టులు భర్తీ చేయకుండా అనేక సంవత్సరాలుగా కాలయాపన చేస్తోందని టిపిసిసి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ అజీజ్ పాషా అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్లో ఆదివారం పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో అజీజ్ పాషా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని,గతంలో ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం బ్యాక్ లాక్ పోస్టులు ఆయా జిల్లా పరిధిలో భర్తీ చేసే వారని అన్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాక్ లాక్ పోస్టుల భర్తీకి అతీగతీ లేదని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.బ్యాక్ పోస్టుల భర్తీకి ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు గత ఏడు సంవత్సరాలుగా కొత్త జిల్లాల ఏర్పడిన తర్వాత కూడా ప్రక్రియను ప్రారంభించక పోవడంతో వీరికి వయో పరిమితి దాటి ఉద్యోగం రాదేమో అనే ఆందోళనలో ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ సోదరుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని అజీజ్ పాషా విమర్శించారు.
నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులకు వయో పరిమితి దాటి పోకముందే జిల్లాలలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాక్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను వెంటనే భర్తీ చేసి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ముషం సత్యనారాయణ, షేక్.రజాక్ బాబా,జగన్,బంటూ సైదులు, రామారాజు,తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్