క్లాప్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వచ్ఛ నగరం గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. నగరంలో ని కోట వద్ద నుండి నగర పాలక సంస్థ కార్యాలయం వరకు జగనన్న స్వచ్ఛ సంకల్ప ర్యాలీ జరిగింది. క్లాప్ కార్యక్రమాల వివరాలతో కూడిన బ్రోచర్ లను ఆవిష్కరించారు. అనంతరం ర్యాలీని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి జెండా ఊపి ప్రారంభించారు.
కోట నుండి ప్రారంభమైన ర్యాలీ మూడు లాంతర్లు, గంటస్తంభం మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకు సాగింది. అక్కడ మానవహారంగా ఏర్పడి జగనన్న సంకల్పం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ర్యాలీ నుద్దేశించి శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ సీఎం జగన్ పల్లెలు, పట్టణాలు స్వచ్ఛంగా ఉండాలన్న లక్ష్యంతో జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.
క్లాప్ పట్ల ప్రజలు మరింత చైతన్యవంతులు కావాలన్నారు. ప్రతి ఇంటికి మూడు చెత్త బుట్టలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. చెత్తను వేరు చేసి తడి, పొడి, ప్రమాదకర చెత్తలను బుట్టలో వేసి కార్పొరేషన్ వాహనాలకు అందించాలని చెప్పారు.
మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలన్న ఉద్దేశంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి క్లాప్ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో రహదారులకు మరమత్తులు చేపట్టామన్నారు. అందరి సహకారంతో స్వచ్ఛ నగరం గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.
నగర మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజారోగ్యం కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో జగనన్న స్వచ్ఛ సంకల్పానికి క్లాప్ కార్యక్రమం నాంది పలికారన్నారు. వీధులలో చెత్త వేయడం ద్వారా ప్రజల ఆరోగ్యం దెబ్బ తినడమే కాకుండా దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు.
ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ర్యాలీ ద్వారా చెత్త వర్గీకరణ, పారిశుద్ధ్య మెరుగుదలకు ప్రజలలో చైతన్యం పెంచేందుకు కు వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రేవతీదేవి, కార్పొరేటర్లు బండారు ఆనంద రావు, గాదెం మురళి,బవిరెడ్డి సతీష్, పొట్నూరు శ్రీనివాసరావు, ధనలక్ష్మి, దాసరి సత్యవతి, నాయన పద్మడాక్టర్ వెంకటేశ్వరరావు, ప్రజా ఆరోగ్య సిబ్బంది, మెప్మా సిబ్బంది, నేచర్ స్వచ్ఛంద సంస్థ, ఎన్సీసి క్యాడెట్లు, పారిశుద్ధ్య సిబ్బంది,ఎం.ఆర్. కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.