జాతీయస్థాయి గోల్డెన్ యారో అవార్డుకు ఎంపికైన స్కౌట్స్ విద్యార్థులను అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ తమీం అన్సారియా అభినందించారు. అన్నమయ్య జిల్లా నుండి 6 మంది విద్యార్థులు జాతీయస్థాయి గోల్డెన్ యారో అవార్డుకు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు తర్ఫీదునిచ్చిన స్కౌట్ అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా డిఇఓ రాఘవరెడ్డి మాట్లాడుతూ ఈనెల 19 నుండి 23 వరకు హర్యానాలో జరిగే గోల్డెన్ యారో అవార్డు ఉత్సవంలో అన్నమయ్య జిల్లాకు చెందిన స్కౌట్ విద్యార్థులు పాల్గొంటున్నారన్నారు. ఈ విద్యార్థులు ప్రాథమిక స్థాయిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ చతుర చరణ్ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసినందున, స్కౌట్ సంబంధ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడం వలన గోల్డెన్ యారో జాతీయ అవార్డులకు వీరు ఎంపికయ్యారన్నారు.
వీరిలో కురబలకోట మండలం నార్లపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన బి.భువనేష్, దిగువ చెన్నామరి ప్రాథమిక పాఠశాలకు చెందిన బి.చరిత్ రెడ్డి, బి.కార్తీక్, వాయల్పాడు మండలం ప్యారం పల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఎన్.శ్రీనివాసులు, బి.అభిషేక్, మదనపల్లి మండలం బాబు నగర్ ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన ఎన్. నవీన్ కుమార్ లు ఉన్నారని తెలిపారు .
వీరితోపాటు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కబ్ (CUB) మాస్టర్స్ ఆర్.సిద్ధారెడ్డి, కె.సుబ్బారెడ్డి, ఏ.చంద్రశేఖర్ రెడ్డి, వై.రవీంద్రారెడ్డిలు పాల్గొంటున్నారన్నారు. చిన్ననాటి నుండే విద్యార్థులలో సేవాభావం, క్రమశిక్షణ, దేశభక్తి అలవడడానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ దోహదం చేస్తుందన్నారు.
ఈ జాతీయ స్థాయి అవార్డులకు ఎంపికైన విద్యార్థులకు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్కౌట్ అండ్ గైడ్స్ సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి, డిఆర్ఓ సత్యనారాయణ, ల్యాండ్ అండ్ సర్వే ఏడి జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.