సీడ్స్ విక్రయదారులు వానకాలం సాగు సీజన్ కు సంబంధించి విత్తన వివరాలను విధిగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య ఆదేశించారు. ఆదిలాబాద్ పట్టణ విత్తన డీలర్లకు వానకాలం సాగుకు సంబంధించి సోమవారం మావల మండల కేంద్రంలోని రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీడ్స్ వ్యాపారులు తమ షాపులకు సంబంధించి లైసెన్స్ గడువు తీరకముందే రెన్యువల్ కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. విత్తనాలకు సంబంధించి స్టాకు, వాటి ధరల వివరాలను రైతులకు స్పష్టంగా కనిపించేలా ప్రతి షాపు వద్ద విధిగా బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
నకిలీ విత్తనాలు, గడువు తీరిన, విత్తనాలు లైసెన్స్ లేకుండా విత్తనాలు అమ్మినట్లయితే అలాంటి వ్యాపారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎన్. రమేష్, మండల వ్యవసాయ అధికారులు భగత్ రమేష్, కైలాస్, వన్ టౌన్ సిఐ శ్రీధర్, మావల ఎస్ఐ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు