వచ్చే ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎవరికి తెలుసు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. నేను వైసీపీలో శాశ్వతమా? అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరికి తెలుసని అన్నారు. ‘పార్టీలు… గాడిద గుడ్డు ఈరోజు ఉంటాయి. రేపు పోతాయి. ఏం… మేమైనా శాశ్వతమా ఈ పార్టీలో….. చెప్పండి.. ఎవరు ఏ పార్టీలో శాశ్వతంగా ఉన్నారో చెప్పండి….. రేపన్నరోజు ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో ఎవరికి తెలుసు?’ అంటూ ఆయన వేదాంత ధోరణిలో మాట్లాడటం ఇక్కడి అధికార పార్టీలో సంచలనం కలిగించింది.
ఏ ఒక్కరూ ఏ ఒక్క పార్టీకో పరిమితం కాదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పోటీ చేసే క్రమంలో ఒక నాయకుడు అనేవాడు వేరే పార్టీలోకి మారడం సహజమని కూడా ఆయన చెప్పారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో నేడు మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.