రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, కొత్తగూడెం మాజీ ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా ల పరిధిలోనే నెలకొండపల్లి, గార్ల, గూడూరు ప్రాంతాలలో అపారమైన ఖనిజ సంపద వున్నదని వెల్లడించారు. బయ్యారం ప్రాంతంలో ఉక్కు కర్మాగారం పెడతామని విభజన సమయంలో కేంద్రం హమీ ఇచ్చి, దానిపై నేటికీ నిర్ణయం తీసుకోకపోవటం దారుణమన్నారు . గతంలో 1.40 లక్షల ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం రక్షణ స్ట్రీల్స్ కు లీజు కు ఇచ్చిందన్నారు. వారు లక్షల కోట్ల ఖనిజ సంపదను తరలించుకు పోతున్న సమయంలో సిపిఐ అడ్డుపడి అనేక ఆందోళనలు చేసిందన్నారు . దీనిపై 2010 జూలై 11 న అసెంబ్లి లో సుదీర్ఘంగా చర్చ జరిగిందన్నారు . తమ ఆందోళనల ఫలితంగా అప్పటి లీజును ప్రభుత్వం రద్దు చేసి , విభజన సమయంలో బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం హామీ ఇచ్చిందన్నారు . బయ్యారం లో 300 మిలియన్ టన్నుల ఖనిజ సంపద వున్నదని , వెంటనే అక్కడ ఉక్కు కర్మాగారం నిర్మించాలన్నారు . ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 9 వ తేదీన బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు పేరుతో నిరాహారదీక్ష చేపడుతున్నట్లు తెలిపారు . హైదరాబాద్ లో ఈ దీక్ష కు ప్రజల నుంచి మద్దతు వస్తుందని వెల్లడించారు . బయ్యారం లో ఉక్కు కర్మాగారం సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కూనంనేని స్పష్టం చేశారు .
previous post