ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ లో 7,409 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి వెల్లడించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారం 7 ఏళ్లలో ఇంత మంది రైతులు ఆత్మ హత్య చేసుకుంటుంటే సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కార్ రైతు ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చిందని, రైతన్నకు తెలంగాణ సర్కార్ చేసిందేమీ లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు దేశానికి వెన్నుముక. కానీ అలాంటి రైతన్నకు తెలంగాణ సర్కార్ చేసిందేమీ లేదు. నలుగురికీ అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూ వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లుతుంటే కేసీఆర్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆమె అన్నారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే రైతు సమస్యలు సమసిపోతాయని నాడు రైతులు కూడా ఉద్యమాలలో పాల్గొన్నారని, కానీ నేడు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కార్ రైతు ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చిందని విజయశాంతి తెలిపారు. తెలంగాణ ఏర్పడిన ఈ ఏడేండ్ల కాలంలో 7,409 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక తెలిపింది.
కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే వెయ్యి మందికి పైగా రైతులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పెద్దల జేబులోకి వెళ్లుతుంటే… చిన్న, సన్నకారు రైతుల రైతు బంధు డబ్బును మాత్రం బ్యాంకర్లు రాబందుల్లా మారి వడ్డీ కింద జమ చేసుకుంటూ రైతన్నలకు పైసా కూడా ఇవ్వడం లేదు అని విజయశాంతి విమర్శించారు.
2018 ఎన్నికల సమయంలో లక్ష వరకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించినా నేటికీ అది సాధ్యం కాలేదని, వానా కాలంలో ఇవ్వాల్సిన క్రాప్ లోన్లు ఇవ్వకుండా రైతన్నల ఉసురు తీస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రూ.30 వేల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం…. రుణమాఫీ చేసేశామని అబద్ధాలు ప్రచారం చేసుకుంటోందని విజయశాంతి తెలిపారు.
వ్యవసాయంలో ఏటా పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ… ఆ మేరకు దిగుబడి రాక రైతన్నలు క్రమంగా అప్పుల ఊబిలోకి నెట్టి వేయబడుతున్నా… తాను రైతునని చెప్పుకునే కేసీఆర్ ఏం చేశాడని ఆమె ప్రశ్నించారు.