డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకొని విజయనగరం నెహ్రూ యువ కేంద్రం విజయనగరం ఆధ్వర్యంలో విజయ దుర్గ యూత్ అసోసియేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సమన్వయంతో రక్తదాన శిబిరం నిర్వహించారు.
డాక్టర్.శ్యామ ప్రసాద్ ముఖర్జీ 121వ జన్మదిన వార్షికోత్సవాన్ని నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, యువజన వ్యవహారాలు మరియు క్రీడలు, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో స్థానిక విజయనగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి జి.విక్రమాదిత్య మాట్లాడుతూ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆధునిక భారతదేశం యొక్క గొప్ప దార్శనికుడు, ఒక గొప్ప జాతీయవాది, దేశభక్తుడు అన్నారు.
ఆయన జీవితంలో చేసిన సంఘసేవల గూర్చి ప్రజలకు మరియు ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యమని అన్నారు. ఆయన విద్యా నైపుణ్యంతో 33 ఏళ్ల వయస్సులో అప్పటి కలకత్తా విశ్వవిద్యాలయం అతి పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్ అయ్యారని తెలిపారు. స్వతంత్ర భారతదేశం మొదటి పరిశ్రమల మంత్రిగా పని చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
1943 లో మూడు మిలియన్ల మందికి పైగా ప్రజలను మృత్యుముఖంలోకి నెట్టిన బెంగాల్ కరువు సమయంలో డా.శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రజల కోసం పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా కీలక పాత్ర పోషించారని తెలిపారు.
కరువు బాధితుల కోసం అతిపెద్ద అనధికారిక సహాయ ప్రయత్నాన్ని నిర్వహించింది ఆయనే అని నేటి తరానికి తెలీదు. ఆయన చేసిన విజ్ఞప్తులతో దేశవ్యాప్తంగా వ్యాపారులు, రాజకీయ నాయకులు, మత, సామాజిక సంస్థలు సహాయాన్ని అందించాయని తెలిపారు. డాక్టర్ ముఖర్జీ నాయకత్వంలో లక్ష మందికి పైగా కరువు బాధితులకు రోజుల తరబడి దఫదఫాలుగా సహాయం అందించబడిందని తెలిపారు.
డాక్టర్ ముఖర్జీ ఆధ్వర్యంలోని హిందూ మహాసభ 227 సహాయ కేంద్రాలను నిర్వహించింది. ఇది కాకుండా, మహాసభ మరో 31 సంస్థలకు కూడా వారి సహాయ చర్యల్లో మద్దతు ఇచ్చింది. నిరుపేదలకు, కష్టాల్లో ఉన్నవారికి ఉపశమనం కలిగించడానికి మార్గాలు రూపొందించడానికి ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. 52 సంవత్సరాల జీవితంలో, ఆయన రాజనీతిజ్ఞుడిగా, విద్యావేత్తగా మరియు రాజకీయ విప్లవకారుడిగా పనిచేశారని తెలిపారు.
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు హఠాక్ నుండి కటక్ వరకు ఏ తారతమ్యాలు లేకుండా దేశం ఉండాలని పోరాడిన గొప్ప మహనీయుడని అన్నారు. వారి ఆలోచన విధానాన్ని భారత ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్న, మనమంతా ఒక్కటే అనే భావనను ప్రతి పౌరునిలో ఉండాలన్నారు. ఒక దేశంలో ఒకే విధానం , ఒకే జెండా ఒకటే దేశం గా ఉండాలని వారు పిలుపునిచ్చి 370 ఆర్టికల్ పై పోరాటం సల్పి ప్రాణాలర్పించిన గొప్ప వ్యక్తి శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని ,వారిని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కె ఆర్ డి ప్రసాద్ ,సెక్రటరీ సత్యం,విజయ దుర్గ యూత్ అధ్యక్షురాలు చంద్రిక,సాయి రెడ్డి,ఏ ఓ ప్రిత్వి,రెడ్ క్రాస్ డాక్టర్ , లలితా గ్రామీణ శిక్షణ కేంద్రం మేనేజర్,ఎన్వై కె సిబ్బంది,రెడ్ క్రాస్ వాలంటీర్స్ మరియు యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు.