ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి హింసాత్మకంగా మారే అవకాశం ఉండడంతో ఒంగోలు నుంచి అదనపు బలగాలను తెప్పించి సింగరాయకొండలో మోహరించారు. పాతకక్షల నేపథ్యంలో వైసీపీ నేత పసుపులేటి రవితేజను కొందరు హత్య చేశారు. నిన్న లారీతో ఢీకొట్టి ఆయనను హత్య చేశారు. విషయం తెలియడంతో సింగరాయకొండ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది.
నిందితులు హత్యకు ఉపయోగించిన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత హత్యకు నిరసనగా ఆందోళన చేస్తున్న వారిలో కొందరు పోలీస్ స్టేషన్ గోడలు దూకి లారీకి నిప్పంటించారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా అదుపుతప్పాయి. లారీకి నిప్పు పెట్టిన ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న చలివేంద్రాన్ని కూడా తగలబెట్టారు. పట్టణంలోని దుకాణాలను మూసివేయించారు.