అత్యంత విషాదకరపరిస్థితుల్లో ఆరుగురు మరణించిన దారుణ సంఘటన ఇది. జార్ఖండ్ లోని డియోగఢ్ జిల్లాలోని దేవీపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ విషాద సంఘటన జరిగింది. సెప్టింక్ ట్యాంక్ నుంచి విష వాయువులు రావడంతో ఆరుగురు మృత్యువాత పడ్డారు.
మరణించిన వారిలో తండ్రి, అతని ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవీపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రెండు వారాల క్రితం సెప్టిక్ట్యాంక్ నిర్మించగా దాని సెంట్రింగ్ మెటీరియల్ను తొలగించే పనులు ఆదివారం చేపట్టారు.
ఈ క్రమంలో లీలూ ముర్ము అనే కూలీ లోపలికి వెళ్లాడు. వెళ్లిన తర్వాత ఎలాంటి శబ్దం రాకపోవడంతో కాంట్రాక్టర్ గోవింద్ మాంఝీ లోపలికి వెళ్లారు. ఆయన కూడా బయటకు రాకపోవడంతో ఆయన ఇద్దరు కుమారులు బబ్లూ, లాలూ కూడా లోపలికి వెళ్లి తిరిగి రాలేదు.
ఇలా లోపలికి వెళ్లిన నలుగురూ తిరిగి రాకపోవడంతో బ్రజేశ్ చంద్ర బుర్నావాల్, మితిలేశ్ చంద్ర బుర్నావాల్ కూడా ఇదే తరహాలో లోపలికి దిగి మృత్యువాత పడ్డారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న అధికారులు విగతజీవులుగా పడి ఉన్న ఆ ఆరుగుర్నీ ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారని డియోఘర్ డిప్యూటీ కమిషనర్ కమలేశ్వర ప్రసాద్ సింగ్ తెలిపారు. సెప్టిక్ ట్యాంక్ గుంత నుంచి కార్బన్ డయాక్సైడ్ గానీ, మోనాక్సైడ్ గానీ విడుదలవ్వడంతో వారు ఊపిరాడక మృత్యువాత పడినట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు.