మంచి పరిపాలన ఎక్కడైనా జరుగుతోంటే జీర్ణించుకోలేని పరిస్థితి ఉందని అందుకే ఇవాళ రకరకాల ఆరోపణల మధ్య రాష్ట్రంలో పరిపాలన చూస్తున్నాం అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ‘వైయస్సార్ ఆరోగ్య ఆసరా’ ను నేడు ఆయన ప్రారంభించారు.
ఈ మధ్య కాలంలో నా మతం, కులం గురించి మాట్లాడుతున్నారు. ‘నా మతం మానవత్వం. నా కులం మాట నిలబెట్టుకోవడం’ అని ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను అని ఆయన అన్నారు. ఎవరు, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా గట్టిగా నిలబడతాను. మీ అందరి దీవెనలు, దేవుడి ఆశీస్సులతో గట్టిగా నిలబడతానని నమ్ముతున్నాను అని ఆయన అన్నారు.
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టామని, ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారికి కూడా పెంచామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ మేరకు జనవరి 1 నుంచి కొత్త కార్డులు జారీ చేయబోతున్నామని, వాటికి క్యూఆర్ కోడ్ కూడా ఇస్తామని ఆయన తెలిపారు.
అందులో ఆ వ్యక్తి మెడికల్ రికార్డుకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఆపరేషన్ తర్వాత విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చినా, పొట్ట కూటి కోసం పనులకు వెళ్లే అవసరం లేకుండా ఈ పథకం ప్రవేశపెట్టామని, రోగి విశ్రాంతి తీసుకునే సమయంలో రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేలు ఇస్తామని, అది ఎన్ని నెలలైనా ఇస్తామని ఆయన తెలిపారు.
ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, 1200 రోగాలకు పథకం విస్తరిస్తూ, జనవరి 1 నుంచి మార్పు చేయబోతున్నాం. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ లో చేరుస్తాము. పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరి 1 నుంచి 3 నెలల పాటు అమలు చేస్తాము. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి నెలకు ఒక జిల్లా చొప్పున విస్తరిస్తాము. ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2 వేల రోగాలను తీసుకువస్తాము అని ముఖ్యమంత్రి చెప్పారు.