భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు రాష్ట్ర అధ్యక్ష పదవిని రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడవ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా బిజెపి శ్రేణులు పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. బాణా సంచాకాల్చి, పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు.
తీన్మార్ డప్పు వాయిద్యాలతో సోమువీర్రాజుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు బిజెపి నేతలు శాలువాలతో సత్కరించారు అదేవిధంగా అయిదుకిలోల కేకును జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీరాం ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర వెంకట శివన్నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడుగా సోమువీర్రాజు గత రెండు సంవత్సరాలు గా చేసిన క్రుషిని ప్రస్తావించారు.
రాష్ట్ర వ్యాప్త పర్యటన సోమువీర్రాజు చేసినట్లు గా ఎవ్వరూ పర్యటన చేయలేరనేది స్పష్టంగా తెలుస్తుందన్నారు. దేవాలయాల ఉద్యమం దగ్గర నుండి అనేక ఉద్యమాలకు రాష్ట్ర అధ్యక్షుడు నేత్రుత్వంలో జరిగిన విషయాలను వెల్లడించారు. బిజెపి నేత లక్ష్మీపతిరాజా మాట్లాడుతూ సోమువీర్రాజు నాయకత్వంలో బిజెపి బలపడిందని, బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం నింపిన సోమువీర్రాజు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అధికార దిశగా పయనించాలన్నారు.
పాత్రికేయులతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు కుటుంబ రాజకీయ పార్టీలు ,ఆ రెండు రాజకీయ పార్టీలు అవినీతి పార్టీలు అని అన్నారు. టీడీపీ, వైసీపీలు కలిసి మోడీ ప్రభుత్వం రాకూడదని వంద శాతం ఆత్మీయ కౌగిలిలో ఉన్నారు. పట్టు వస్త్రాల చాటున కౌగిలించుకుంటున్నారని వ్యంగ్యంగాస్త్రాలు సంధించారు.
అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రబాబు ప్రత్యేకప్యాకేజీకి అంగీకరిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. ప్యాకేజీ వల్లే ఎపీకి ఎంతో మేలు జరుగుతుందని ప్రకటించారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎంపీ ఎపీకి ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్ లో మాట్లాడతారు. ఎపీ అభివృద్ది కోసం వేలకోట్ల రూపాయలను మోడీ కేటాయించారు.
15వేల కోట్ల రూపాయలు అభివృద్ది కోసం వినియోగించుకోరా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని తీవ్ర స్వరంతో డిమాండ్ చేశారు. ఒకవైపు నిధులు తీసుకుంటూనే.. మరోవైపు ప్రత్యేక హోదా అంటారా అంటూ మండిపడ్డారు. హోదా ను ఒక బూచీగా చూపి బీజేపీపై నిందలు వేయాలని చూస్తున్నారు. టీడీపీ,వైసీపీలు కలిసి గూడు పుఠాని నాటకం ఆడుతున్నారు.
ఈ పరిణామాలను సహించం.. చాలా సీరియస్ గా తీసుకుంటాం. ముఖ్యమంత్రికి దమ్ముంటే.. ప్రధాన మంత్రిని విమర్శించాలని సవాల్ చేస్తున్నా విమర్శలు చేస్తే.. ఎపీలో బీజేపీ బల పడుతుందని వారికి తెలుసు. బీజేపీ ఎపీలో ఎదుగుదల కారణంగా నిజమైన అభివృద్ది సాధిస్తుంది అని ఆయన అన్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే రెండు పంటల మీద యేడాదికి 50వేలకోట్లు వస్తాయి. ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి మాత్రం మీరు సహకరించరు. గాలేరు నగరి, హంద్రీనీవా ఈ విధంగా మిగిలిన ప్రాజెక్టులను రెండు పార్టీలు ప్రస్తావించరు. అంటే వీరిద్దరూ ఎంత అంటకాగుతున్నారో అర్ధం అవుతోంది అని ఆయన అన్నారు.