విద్యుత్ వైర్లు పడి మృతి చెందిన, గాయపడిన కూలీల కుటుంబాలను అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి పరామర్శించారు. బొమ్మనహాళ్ మండలం దర్గా హోన్నూరు గ్రామంలోని విద్యుత్ షాక్ తో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. ప్రమాద మృతుల మరియు గాయపడిన వారి కుటుంబాలను పరామర్శించిన ఎస్ పి వారిని ఓదార్చారు. ఒకే ఇంట్లో అత్త, కోడలు చనిపోయిన ఇంటికెళ్లి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనపై విచారించి ఓదార్చారు. అనంతరం మృతుల్లో మరో ఇద్దరైన శంకరమ్మ, పార్వతమ్మ ఇళ్లకు మరియు గాయపడిన కూలీల ఇళ్లకు వెళ్లి వివరాలు కనుక్కున్నారు. బాధిత కుటుంబాల పరిస్థితులు, స్థితిగతులపై ముఖాముఖిగా మాట్లాడి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీతో పాటు కళ్యాణదుర్గం ఇన్ఛార్జి డీఎస్పీ ప్రసాదరెడ్డి, రాయదుర్గం రూరల్ సి.ఐ యుగంధర్ , తదితరులు వెళ్లారు.
previous post