కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మార్చి 24 నుంచి 30 వరకు భక్తులందరికీ శ్రీ స్వామివార్ల స్పర్శదర్శనం కల్పించనున్నారు. శ్రీశైల మహా క్షేత్రంలో మార్చి 30 వతేదీ నుంచి ఏప్రియల్ 3వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్న నేపధ్యంలో ఈ కింది నిర్ణయాలు తీసుకున్నారు.
ఉగాది మహోత్సవాలలో సుమారు వారం ముందు నుంచే కర్ణాటక, మహారాష్ట్రలలోని పలు ప్రాంతాల భక్తులు క్షేత్రానికి విచ్చేసే అవకాశం ఉంది.ఈ కారణంగా మార్చి 24వ తేది నుంచి 30వ తేదీ వరకు వారం రోజులపాటు భక్తులందరికీ శ్రీస్వామివారి స్పర్శదర్శనం కల్పించనున్నారు.
ఈ వారం రోజులలో (మార్చి 24 నుంచి 30వ తేదీ వరకు) ఉచిత దర్శనంతో పాటు శీఘ్రదర్శనానికి (రూ. 500/-రుసుముతో) కూడా అవకాశం ఉంది. భక్తులందరికీ స్పర్శదర్శనం కల్పిస్తున్న కారణంగా రద్దీని బట్టి స్పర్శదర్శనానికి సుమారు 5 గంటల నుంచి 10 గంటలకు పైగా సమయం పట్టవచ్చు.
ఉత్సవాలలో రెండో రోజైన మార్చి 31వ తేదీ నుంచి ఉత్సవాలు ముగిసే ఏప్రియల్ 3వ తేదీ వరకు భక్తులందరికీ శ్రీస్వామివార్ల అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు. ఈ ఉత్సవాల సమయం లో కూడా కర్నాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు అధికసంఖ్యలో క్షేత్రాన్ని సందర్శిస్తారు. ఈ రోజులలో కూడా దర్శనానికి సుమారు 6 గంటల నుంచి 10 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది.
భక్తులందరు కూడా ఈ విషయాన్ని గమనించి సహకరించవలసినదిగా దేవస్థానం కోరింది. మార్చి 24 నుంచి 30 వతేదీ వరకు శ్రీ స్వామివారి గర్భాలయ ఆర్జిత అభిషేకం పూర్తిగా నిలుపుదలచేసారు. ఈ రోజులలో రూ.1500/-ల సేవా రుసుముతో నిర్వహించే అభిషేకాలు శ్రీ వృద్ధమల్లికార్జునస్వామి వారికి జరుపుతారుఈ అభిషేక సేవాకర్తలకు కూడా శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం కల్పిస్తారు. ఈ వారం రోజులలో అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు, శ్రీవల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామివారి కల్యాణం, శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణాలు కూడా యథావిధిగా జరుగుతాయి.