మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీని ఛేదించడానికి సీబీఐ వేగం పెంచింది. ఏ క్షణమైనా కడప పెంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్దం చేసిందని తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు సమన్లను జారీ చేసింది. అయితే, ఐదు రోజుల తరువాత హాజరవుతానని ఆయన ఇచ్చిన సమాధానం అందిన తరువాత మరోసారి సమన్లను ఇవ్వడం చూస్తుంటే, ఈసారి సీబీఐ వదిలేలా కనిపించడంలేదు. కేసు కూడా కడప నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ కావడంతో సీబీఐ దూకుడు పెంచింది.
వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు తర్వాత మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సీబీఐ చేతిలో అనుమానితుల లిస్టు ఉందని వినికిడి. కొన్ని పెద్దతలకాయలు బయటపడే అవకాశం ఉందని సర్వత్రా వినిపిస్తోంది. అభియోగాల పై అవినాష్ రెడ్డి స్పందించారు. ఐదు రోజుల తర్వాత సీబీఐ విచారణకు హాజరవుతానని చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో పెద్దతలకాయలు ఉన్నాయని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. గత ఎన్నికల సందర్భంగా కడప నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించేందుకు కొన్ని గంటల ముందు వివేకా హత్యకు గురయ్యారు.
మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్లు) సోదాలు నిర్వహించినా మిస్టరీని చేధించడంలో విఫలం కావడం ఆనాటి చంద్రబాబు ప్రభుత్వ చేతగానితనం. తాజాగా కొందరు బంధువులపై అనుమానం వ్యక్తం చేసిన వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు 2020లో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. 2021 అక్టోబరు 26న హత్య కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. జనవరి 31, 2022న అనుబంధ ఛార్జిషీటును దాఖలు పరిచింది. హత్య వెనుక పెద్ద కుట్రపై విచారణ, దర్యాప్తును హైరాబాద్లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో న్యాయమైన విచారణ జరగడంలేదని సునీతారెడ్డి లేవనెత్తిన సందేహాలను పరిశీలించి ఆ మేరకు నిర్ణయం తీసుకుంది.