కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలో రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పరామర్శించారు. నిన్న సాయంత్రం నిజాంసాగర్ మండలం హసన్పల్లి వద్ద జరిగిన లారీ-ఆటో ఢీ కొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెంది మరో 15 మంది గాయపడ్డారు. ఈ సంఘటన మృతుల్లో ఆరుగురు పిట్లం మండలం చిల్లర్గి వాసులు. అదే విధంగా పెద్దకొడపగల్ మండలం తుగ్దల్, కాటేపల్లి, బాన్సువాడ పట్టణానికి సంబంధించిన వారు ఒక్కొక్కరు ఉన్నారు.
బాన్సువాడ ఏరియా హస్పిటల్ లో చికిత్స పొందుతున్న గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఇప్పటికే అధికారులను, వైద్యులను స్పీకర్ ఆదేశించారు.
స్థానిక జహీరాబాద్ MP బిబీ పాటిల్, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ లతో కలిసి ఈరోజు చిల్లర్గి గ్రామంలో బాధిత కుటుంబాలను స్పీకర్ పరామర్శించి జరిగిన సంఘటనపై సంతాపం వ్యక్తం చేసి వారిని ఓదార్చారు. మృతదేహాలకు పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు.
అనంతరం బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడకు చెందిన మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి వారిని ఓదార్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాక్సిడెంట్ మృతులకు ఒక్కొకరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ కి స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు.