ఓటర్ జాబితా చూసుకునేందుకు సెప్టెంబర్ 2,3 వ తేదీల్లో స్పెషల్ క్యాంపెన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, బూత్ లెవల్ అధికారులు, సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని, ఓటరుగా పేరు ఉందొ లేదో చూసుకోవడం, లేకుంటే వెంటనే నమోదు చేసుకోవడం, సమస్యలు ఉంటే దృష్టికి తేవాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రతి వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని, 1 అక్టోబర్ కటాఫ్ తేదీ అని, ఆ రోజుకు 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరు ఓటరుగా నమోదయ్యేలా అవగాహన కల్పించాలన్నారు.
రాజకీయ పార్టీలు తమ తమ బూత్ లెవల్ ఏజెంట్, బాధ్యుల జాబితా సమర్పించాలన్నారు. బూత్ లెవల్ ఏజెంట్, బాధ్యులతో బూత్ లెవల్ అధికారులు సమన్వయం చేసుకొని ముందుకు వెళతారన్నారు.పెరిగిన పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవల్ అధికారులను కేటాయించడం జరిగిందని అట్టి జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఇవ్వడం జరిగిందన్నారు.జవనరి,2023 నుండి జులై వరకు ఓటరుగా నమోదైన వారికి ఎపిక్ కార్డు అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.