పేదప్రజలకు ఇళ్లు ఇస్తామనే పేరుతో జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతిలో సృష్టించిన ఆర్ 5 జోన్ విషయంలో సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. ఆర్5 జోన్ పై ఏపీ హైకోర్టు ఆర్డర్ పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇచ్చేందుకు ప్రతివాదులకు మూడు వారాల గడువిస్తూ తదుపరి విచారణను నవంబర్ నెలకు వాయిదా వేసింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ 5 జోన్ ను సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై అమరావతి రైతులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలను ఆపేయాలంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం కోసమే ఆర్5 జోన్ లో ఈ ప్రాజెక్టును చేపట్టామని ధర్మాసనానికి ప్రభుత్వం తరపు లాయర్ తెలిపారు. అయినప్పటికీ హైకోర్టు ఆర్డర్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింగ్వి హైకోర్టు ఆర్డర్ మీద అత్యవసర స్టే ఇవ్వమని అడిగారు. దీనిపై స్టే ఇవ్వాల్సినంత తొందరేమీ లేదు… దాదాపు 1000 కోట్ల పైన ప్రభుత్వ డబ్బును ఖర్చు చేస్తున్నారు కాబట్టి దీనిని పరిశీలించాలి…అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంటూ కేసును నవంబర్ కు వాయిదా వేసింది. అమరావతి తరపు పిటిషర్లను కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించింది.
previous post