భారతదేశ శ్రేయస్సు కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను ఆదర్శంగా తీసుకొని ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. సోమవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నేతాజీ చిత్ర పటానికి సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ నేతాజీ స్థాపించిన భారత సైన్యం వలనే ప్రజలు స్వేచ్చగా ఉండగలుగుతున్నారని, ఎండ, చలి, వాన అనకుండా సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికులను గౌరవించడం ప్రతి భారతీయుడు బాధ్యతగా భావించాలని తస్లీమా అన్నారు.
భారతదేశం స్వాతంత్య్రం కోసం అలుపెరుగని పోరాటంతో మాతృ భూమి సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన నేతాజీ జీవితం స్ఫూర్తిదాయకమని, భారతదేశాన్ని బందీలుగా ఉంచే శక్తి ఈ భూమి మీద లేదు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను దేశానికి స్వాతంత్య్రం తెస్తాను అన్న నేతాజీ మాటలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని భారతదేశ ఔన్నత్యాన్ని చాటాలని తస్లీమా అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది రిజిస్ట్రేషన్ దారులు తదితరులు ఉన్నారు.