ఇరాక్ లో చిక్కుకున్న 16 మంది తెలంగాణకు చెందిన వలస కార్మికులను తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కు తీసుకువచ్చింది. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వీరంతా చేరుకున్నారు. వీరందరిని వారి సొంత ప్రాంతాలకు పంపేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను కూడా తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ సమకూర్చింది.
తమ బాధలకు స్పందించి వెంటనే సహాయం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రి కేటీఆర్ కి వారంతా ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంలో వేగంగా స్పందించిన తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ అధికారి చిట్టి బాబుకి, మంత్రి కేటీఆర్ కి వారు ధన్యవాదాలు తెలిపారు. ఇరాక్ లో చిక్కుకున్న బాధితులు మంత్రి కేటీఆర్ కు సోషల్ మీడియా ద్వారా విన్నవించుకున్నారు.
ఇరాక్ లో చిక్కుకొని అనేక బాధలు పడుతున్నామని, నకిలీ ఏజెంట్ల మోసంతో ఆక్కడ చిక్కుకొని వసతి సౌకర్యాలు లేక సొంత ప్రాంతాలకు తిరిగి రాలేక మూడు సంవత్సరాలుగా నరక యాతన అనుభవిస్తున్నామని మంత్రి కేటీఆర్ కు తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్, తెలంగాణ ఎన్నారై శాఖ అధికారులకు సమాచారం అందించి, వారిని సొంత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలు అందించాలని సూచించారు.
ఈ మేరకు ఇరాక్ లోని భారత రాయబార కార్యాలయం తో, భారత విదేశాంగ శాఖ అధికారులతో సమన్వయం చేసిన తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ, అక్కడ ఇరాక్ లో చిక్కుకున్న వారిని తెలంగాణకు రప్పించారు.