తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతారోత్సవాలు గురువారం ముగిశాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవర్లకు తిరుమంజనం నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం శ్రీ సుందరరాజస్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించనున్నారు.