పసుపు పంటకు పదిహేను వేల రూపాయల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక జగిత్యాల జిల్లా కలెక్టర్ కు నేడు వినతి పత్రం అందచేసింది. 176 మంది కర్షకులు రాజకీయాలకు అతీతంగా పార్లమెంట్ బరిలో నిలిచి రైతులంటే ఏమిటో దేశానికి వెల్లడించారని, రైతులందరి కృషికి ఫలితమే సుగంధ ద్రవ్యాల బోర్డు ఏర్పాటు జరిగిందని జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి తెలిపారు.
ఆ బోర్డుతో రైతులకు ఎంత లాభమూ ఎంత నష్టమూ తరువాత విషయం. ఎందుకంటే ఇది పసుపు పంట చేతికి వచ్చిన సమయం. ఇంకో వారం లోపు పసుపు పంట అమ్ముకునే సమయం. పక్క రాష్ట్రాల్లో ఇస్తున్న బోనస్ మాదిరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బోనస్ ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయ్యాలి.
కేంద్ర ప్రభుత్వం తక్షణమే పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలి. ఇప్పుడు రాకపోతే ఇంకెప్పటికి పసుపుకు మద్దతు ధర రాదు. ప్రతి రైతు రోడ్డు ఎక్కి మన పంటకు గిట్టుబాటు ధర కోసం పోరాడే సమయం ఆసన్నమైందని తిరుపతి రెడ్డి అన్నారు.