విద్యార్థి జేఏసీ పేరిట రెండు రోజుల్లో బిల్లును ఆమోదించకపోయిన పక్షంలో రాజ్ భవన్ ముట్టడిస్తామని ప్రకటించడం తీవ్రంగా ఖండిస్తున్నామని డాక్టరేట్స్ అసోసియేషన్ కన్వీనర్ డా.సంతోష్ గౌడ్ తెలిపారు.
గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 15 విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులని భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామకాల బోర్డుని ఏర్పాటు చేసి బిల్లుల ఆమోదం కోసం గవర్నర్ వద్దకి పంపడం అందరికీ తెలిసిన విషయమేనన్నారు. గవర్నర్ ఆ నియామక బిల్లుల సాధ్యాసాధ్యలపై కూలంకషంగా పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో చూసిన తర్వాత అందులోని వాస్తవాలను వెలికి తీసి పారదర్శకంగా నియామకాలు జరపాలని, యూనివర్సిటీలో స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాలని, న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలని దీనిపై అధ్యయనం చేసిన తర్వాతే బిల్లలు ఆమోదం పొందుతాయని గవర్నర్ నిన్న ప్రకటించారని తెలిపారు. దీనిపై విద్యార్థి సంఘాల పేరుతో బిల్లుల ఆమోదం తెలపకపోతే రాజ్ భవన్ ముట్టడిస్తామని ఇచ్చిన ప్రకటనను ఖండించారు.
ముట్టడించాల్సింది రాజ్ భవన్ ని కాదని ప్రగతిభవన్ ను ముట్టడించాలని హితువు పలికారు. విద్యార్థి జేఏసీగా ముసుగు తీసి టిఆర్ఎస్వి పేరుతో ప్రకటన ఇస్తే బాగుండేదన్నారు. 8సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకులు భర్తీల గురించి మాట్లాడని వ్యక్తులు నెల రోజులు రాజభవన్ లో బిల్లుల ఆమోదానికి పెండింగ్లో ఉన్న బిల్లులపై మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు.
వెంటనే కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ విధానాన్ని రద్దుచేసి పూర్తిగా పాత పద్ధతిలోని యూజీసీ నిబంధనలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల భర్తీలు చేపట్టాలని డాక్టరేట్స్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విష్ణు, మోహన్, రాజేందర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.