స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలనే పిటిషన్ విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కేరళ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించగా రేపటి నుంచి పోలింగ్ ప్రారంభం కావాల్సి వుంది.
అయితే సవరించిన చట్టాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికల సంఘం ఎన్నికలను ప్రకటించిందని ఆరోపిస్తూ కేరళ ఎమ్మెల్యే పి సి జార్జి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందువల్ల సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఎన్నికలను నిలుపుదల చేయాలని ఆయన కోరారు.
కేసు పూర్వాపరాలను పరిశీలించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు పిటిషన్ ఉప సంహరించుకోవాల్సిందిగా ఆదేశాలిచ్చారు. తాము ఈ విషయంలో జోక్యం చేసుకునేది లేదని అన్నారు.
తమ వాదన వినాలని పిటిషనర్ చేసిన వినతిని కూడా సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. పిటిషన్ ఉప సంహరించుకోవాలని లేకపోతే డిస్మిస్ చేస్తామని చెప్పడంతో పిటిషనర్ అందుకు అనుగుణంగా చేశారు.
కేరళలో కరోనా ఉధృతి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిలుపుదల చేయాలని అంతకు ముందు కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కరోనా కారణంగా చాలా మంది ఓటింగ్ లో పాల్గొనే అవకాశం లేదని పిటిషనర్ కేరళ హైకోర్టులో వాదించారు. వాదనలు విన్న కేరళ హైకోర్టు పిటిషన్ ను కొట్టేసింది.
రాజ్యాంగపరంగా ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల్లో తాము జోక్యం చేసుకోలేమని కేరళ హైకోర్టు తెలిపింది. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా పిటిషన్ తిరస్కరించారు.