విజయశాంతి మళ్లీ బిజెపిలో చేరారు. నిన్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డాను కలిసి పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన విజయశాంతి నేడు జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు.
ఈ సందర్భంగా తన రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ..1998లో బీజేపీలో చేరాను. కొందరు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారని 2005లో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చాను. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి అనేక సమస్యలపై పోరాటం చేశాను.
అప్పుడు నా పార్టీనీ టీఆర్ఎస్లో విలీనం చేయమని అడిగారు. నిజానికి నేను 1998లోనే తెలంగాణ పోరాటం మొదలు పెట్టాను. టీఆర్ఎస్ కంటే ముందు నేను తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యాను. కేసీఆర్ కుట్రతోనే టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్ పార్లమెంట్లో లేరు.
ఆయన సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణలో తన కుటుంబం మాత్రమే ఎదగాలనే స్వార్థం కేసీఆర్ది. కాంగ్రెస్ పార్టీ అసలు సమస్యలపై పోరాటం చేయడం లేదు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ మాత్రమే అని విజయశాంతి అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కె.లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.