కరోనా చికిత్సలో విరివిగా వినియోగిస్తున్న రెమిడిస్వేర్, ఫావిపిరవేర్ మందులను వినియోగించేందుకు కేంద్రం అనుమతి ఉందా లేదా చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ మేరకు కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ రెండు మందులు ఉత్పత్తి చేసే కంపెనీలు తమ ప్రకటనలతో మార్కెట్ లో విస్తృత ప్రచారం చేసుకుని కరోనా చికిత్సలో ఈ మందులు వాడేలా చేసుకుంటున్నారని, వాస్తవానికి ఈ మందులతో కరోనా చికిత్సలో ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపిస్తూ ఎం ఎల్ శర్మ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎఏ బాబ్డే, జస్టిస్ ఏ ఎస్ బొపన్నా, జస్టిస్ వి సుబ్రహ్మణ్యియన్ ల బెంచ్ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) చేసిన అనేక పరిశోధనల్లో ఈ రెండు మందులు కరోనా రోగులకు పని చేయడం లేదని తేలినట్లు ఉన్న పత్రాలను న్యాయవాది శర్మ కోర్టుకు సమర్పించారు. ఈ పరిశోధనలను చైనా వారు అమెరికా వారు కూడా ఆమోదించారని ఆయన కోర్టు కు విన్నవించారు.
ఈ మందులను విరివిగా వినియోగిస్తున్న డాక్టర్లపైనా, సరఫరా చేస్తున్న సంబంధిత కంపెనీలపైనా ఔషధ నియంత్రణ చట్టం కింద కేసులు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు.
ఈ మందులు వాడినా కరోనా తగ్గని వారికి నష్ట పరిహారం ఇప్పించాలని, ఈ మొత్తం తతంగంపై సిబిఐతో విచారణ జరిపించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు.