తెలంగాణ మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ సరోజినీ దేవి నేడు తొలిమెట్టు కార్యక్రమం నిర్వహణా తీరును పరిశీలించడానికి నేడు ములుగు జిల్లాలో పర్యటించారు. వెంకటాపుర్ మండలం లోని MPPS జంగాల పల్లి, MPPS జంగాల పల్లి X రోడ్, MPPS వెంకటాపుర్ లను ఆమె సందర్శించారు. ఉపాధ్యాయులు తరగతి లో ఎలా బోధన చేస్తున్నారో ఆమె పరిశీలించారు. బోధనలో ఉపకరణాలు ఎలా ఉపయోగిస్తున్నారో కూడా పరిశీలించారు. ఉపాధ్యాయులు రాసిన పాఠ్య ప్రణాళికలను పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలను చేశారు. తెలుగు, గణితం బోధనలో ఖచ్చితంగా 90 నిమిషాల పీరియడ్ ను నిర్వహించాలని సూచించారు. మొదటి 45 నిమిషాలు కనీస సామర్థ్యాల సాధన కోసం మిగతా 45 నిమిషాలు పాఠ్యాంశాల ఆధారిత బోధన చేసి అభ్యాసన ఫలితాలు రావడానికి కృషి చేయాలని చెప్పారు. ఆరు వరుస పని దినాలలో అయిదు రోజులు బోధనకు ఆరవ రోజు మూల్యాంకనం చేయాలని చెప్పారు.
ప్రతీ నెలా విద్యార్థి ప్రగతిని తప్పక స్టూడెంట్ లెర్నింగ్ ట్రాకర్ ఆప్ ద్వారా నమోదు చేయాలని చెప్పారు. పాఠశాలలో సబ్జెక్ట్ వారీగా, తరగతి వారీగా, పాఠశాల వారీగా విద్యార్థుల ప్రగతి నమోదు రిజిస్టర్ లను నిర్వహించాలని అదేవిధంగా ప్రతీ నెల మూడవ శనివారం బాల సభ, తల్లి తండ్రుల సమావేశం నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కో ఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి, ములుగు మండలం విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు, వెంకటాపుర్ మండల తొలిమెట్టు నోడల్ అధికారి ప్రభాకర్,ప్రధానోపాధ్యాయులు బాబురావు, వీరేందర్, సలేంద్రం, మహేందర్, శ్యామ్, ప్రవీణ, రాజయ్య,తదితరులు పాల్గొన్నారు.