రాష్ట్రంలో సర్పంచ్ లెవ్వరూ గ్రామాలకొచ్చిన విద్యుత్ బిల్లులు కట్టొద్దని రాష్ట్ర సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా కేంద్రం లో దాసన్నపేట విజయనగరం ఫంక్షన్ హాలులో సర్పంచ్ ల సదస్సు జరిగింది. సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. అనంతరం రాజేంద్రప్రసాద్ మీడియా మాట్లాడారు.
రాష్ట్రంలోని సర్పంచ్ లెవ్వరు గ్రామపంచాయతీల విద్యుత్ బిల్లులు కట్టవద్దని, పాత పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 12918 గ్రామ పంచాయతీల సర్పంచులు ఎవ్వరు పంచాయతీల కరెంట్ బిల్లులు కట్టవద్దని, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి 14, 15 వ ఆర్థిక సంఘాల ద్వారా పంచాయతీలకి పంపించిన రూ. 8660 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకుందని, అదేమంటే ఆ డబ్బులు కరెంటు బకాయిల కింద జమ చేసుకున్నామని చెబుతూనే, మరలా కరెంట్ బిల్లులు కట్టమని సర్పంచ్ల పై అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని, అయినా అసలు గత ప్రభుత్వాలు గ్రామపంచాయతీలకు ఉచిత విద్యుత్ని ఇచ్చారని, ఈ ప్రభుత్వం దానిని విస్మరిస్తూ ఏవో కుంటి సాకులు చెబుతూ పంచాయతీలకు కేంద్రం పంపిన నిధులు అన్నీ కూడా దారి మళ్లించి వేసిందని రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.
అదేవిధంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన 8660 కోట్లను వెంటనే మా పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని, అలాగే గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఉన్న అన్ని రకాల నిధులను కరెంటు బిల్లుల క్రింద జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, దీనిని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, రాష్ట్ర సర్పంచుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని రాజేంద్రప్రసాద్ అన్నారు.
లక్ష్మీ ముత్యాలరావు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణితో మా సర్పంచులను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుందని, కేంద్రం పంపిన ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుతుందని, వెంటనే ఆ నిధులను మా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయకుంటే, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని అన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.
అందులో ప్రధానంగా సర్పంచుల నిధులు ,విధులు, అధికారాల సాధన కోసం, కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘం ద్వారా 12918 గ్రామాల సర్పంచులకు పంపిన 8660 కోట్ల రూపాయలు తిరిగి సర్పంచుల PFMS పీఎఫ్ఎంఎస్ ఖాతాల్లో జమ చెయ్యాలన్నారు. గ్రామ సచివాలయాలను, వాలంటీర్లను సర్పంచుల అధ్వర్యంలోకి తీసుకురావాలని కోరారు. సర్పంచులకు , ఎంపీటీసీ లకు 15 వేలు అలాగే ఎంపీపీ లకు, జడ్పిటిసి లకు 30000 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ నిధులు కూడా గతంలో మాదిరే సర్పంచులకు ఇవ్వాలని కోరారు. పాత పద్ధతిలోనే పంచాయతీలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నారు. గత మూడు న్నర సంవత్సరములుగా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన గ్రామ పంచాయతీల బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 13 డిమాండ్ల సాధన కోసం రాజకీయాలకతీతంగా రాష్ట్రంలోని సర్పంచులందరినీ కలుపుకొని ఉద్యమాలు ఉధృతం చేస్తామని రాజేంద్రప్రసాద్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, రాష్ట్ర ఉాధ్యక్షులు అనెపు రామక్రిష్ణ, రాష్ట్ర నాయకులు గేదెల రాజారావు, కర్రోతు సత్యనారాయణ, తుంపల్లి రమణ,రాష్ట్ర కార్యదర్శి వానపల్లి ముత్యాలరావు, చిత్తూరు జిల్లా చుక్కా అద్యక్షులు ధనుంజయ యాదవ్, రాష్ట్ర ఉాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బారామయ్య, గౌరవ సలహాదారు వీరభద్ర ఆచారి సర్పంచుల సంఘం నాయకులు సోమునాయుడు, మజ్జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.