భూ కబ్జా, బెదిరింపుల కేసులో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. ఇదివరకే గత శనివారం రోజున నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా మరొక అరెస్టుతో ఐదుకు చేరింది. కామారెడ్డి పట్టణానికి చెందిన కుచాని బస్వయ్యకు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామ శివారులో సర్వే నెంబర్ 207లో 703.33 గజాలలో ఉన్న 5, 6, 20, 21 నెంబర్ ఓపెన్ ప్లాట్ ను ఉరుదొండ నర్సయ్య నుండి 1985 కొనుగోలు చేసి అప్పటి నుండి కబ్జాలో ఉన్నారు.
అయితే ఆ భూమికి సంబంధించి వేరే దస్తవేజులు సృష్టించి ఉరుదొండ నర్సయ్య కుమారుడు ఉరుదొండ రాజయ్య, అతని కుమారులు నరేష్ కుమార్, రవికుమార్, ప్రవీణ్ తో పాటు 35 వ వార్డు కౌన్సిలర్ కృష్ణాజిరావు, దోమకొండ మండలం లింగుపల్లి గ్రామానికి చెందిన గొల్ల స్వామి గత సంవత్సరం అక్టోబర్ 10 న బాధిత వ్యక్తి బసవయ్యను 10 లక్షలు ఇవ్వాలని బెదిరించడంతో పాటు చంపేస్తామని భయబ్రాంతులకు గురిచేశారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు గత శనివారం స్వామి, కౌన్సిలర్ కృష్ణాజిరావు, ఉరుదొండ ప్రవీణ్, ఉరుదొండ నరేష్ లను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసులో నేడు మరొక వ్యక్తి ఉరుదొండ రవికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. దాంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఐదుకు చేరింది.
సత్యం న్యూస్, కామారెడ్డి