ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం లో గుర్తింపు లేని మదర్సాలపై సర్వే నిర్వహించబోతున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వివిధ బృందాలను ఏర్పాటు చేశారు. సర్వేలో 11 అంశాలపై మదర్సా నిర్వాహకుల నుంచి సమాచారం తీసుకుంటుండగా అందులో మదర్సాల ఆదాయవనరు ఎంత అనేదే ప్రధానం.
అక్టోబర్ 25లోగా సర్వే నివేదికను ప్రభుత్వానికి అందచేయాల్స ఉంది. రాష్ట్రంలో మొత్తం 16500 గుర్తింపు పొందిన మదర్సాలు ఉన్నాయి. వీటిలో 558 ఎయిడెడ్ మదర్సాలు కాగా, 7,442 ఆధునిక మదర్సాలు. ఈ మదర్సాలన్నింటిలో 19 లక్షల మందికి పైగా పిల్లలు ఉన్నారు. పిల్లలందరినీ ఆధునిక విద్యతో అనుసంధానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇదే కారణంతో మదర్సాలలో కూడా కొత్త సబ్జెక్టులు అమలు చేస్తున్నామని మదర్సా రిజిస్ట్రార్ జగ్మోహన్ సింగ్ తెలిపారు.
ఎయిడెడ్ మదర్సాలపై సర్వే జరుగుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లేని మదర్సాలపై కూడా సర్వే నిర్వహించాలని ప్రభుత్వం కోరడం గమనార్హం. మదర్సాను నిర్వహిస్తున్న సంస్థ పేరు మరియు దాని ప్రధాన ఆదాయ వనరు ఏమిటి అనేది సర్వేలో కనిపిస్తుంది. మదర్సాల సర్వేపై కూడా రాజకీయం మొదలైంది. ఓవైసీ దీన్ని వ్యతిరేకిస్తుండగా, బీఎస్పీ అధినేత్రి మాయావతి దీనిపై ప్రశ్నలు సంధించారు.
అంతే కాకుండా మదర్సాలలో చదువుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని పలు ముస్లిం సంస్థలు చెబుతున్నాయి. దానిపై విచారణ చేయడంలో అర్థం ఏమిటి? అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అక్టోబర్ 15లోగా సర్వే బృందాలు పూర్తి చేయాల్సి ఉండగా, అక్టోబర్ 25లోగా జిల్లా ఉన్నతాధికారులు నివేదికను ప్రభుత్వానికి పంపాల్సి ఉంది. ఈ సర్వేలో చాలా చోట్ల బృందాలు మదర్సాల సమస్యలపై సమాచారం రాబడుతున్నాయి.
గుర్తింపు లేని మదర్సాలపై జరుగుతున్న సర్వేలో గుర్తింపు లేని మదర్సాల నిర్వాహకులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. అటువంటి మదర్సాల నిర్వాహకులు సంబంధిత ఫార్మాట్లో మొత్తం సమాచారం వివరాలను స్వయంగా అందించవచ్చు. ఈ సమాచారాన్ని సంబంధిత జిల్లాలోని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారికి సమర్పిస్తారు. తర్వాత టీమ్ దాని ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తుంది.
నిజానికి ఈ సర్వేపై చాలా చోట్ల వ్యతిరేకత వ్యక్తమవగా, పలు ముస్లిం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ కారణంగానే మదర్సా నిర్వాహకులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఈ విషయమై మైనారిటీ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డానిష్ ఆజాద్ అన్సారీ మాట్లాడుతూ మదర్సా నిర్వాహకులు పూర్తి సమాచారం అందించాలని సూచించారు. షరతులు పాటిస్తే గుర్తింపు ఇవ్వడం సులువవుతుందని తెలిపారు.