తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతును రాజును చేశాడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యశోద రాములు ప్రమాణ స్వీకార కార్యక్రమం లో నేడు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల కడగండ్లను తుడిచి వ్యవసాయాన్ని పండుగలా మార్చాడని అన్నారు. రైతు వేదికలు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని, రైతులు గొప్పగా జీవిస్తూ, ఆత్మగౌరవంతో లక్షాధికారులు కావలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అని ఆయన అన్నారు.
వ్యవసాయ మార్కెట్ పాలక వర్గాలలో రిజర్వేషన్లు తెచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. ఎన్నికైన నూతన వ్యవసాయ పాలక వర్గాలు రైతులకు మేలు చేకూర్చి నిజాయితీగా సేవ చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి తో బాటు ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే సైదిరెడ్డి స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.