కడపజిల్లాలో వైసీపీ అక్రమాలు, దాడులకు పాల్పడటాన్ని నిరసిస్తూ కమలాపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నామని కమలాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పుత్తా నరసింహారెడ్డి అన్నారు. వైసీపీ పోలీసులను అడ్డంపెట్టుకుని శిఖండి వేషాలు వేస్తోందని, వైసీపీకి దమ్ము, ధైర్యం ఉంటే పార్టీ గుర్తు లేకుండా ఎన్నికలకు రావాలని ఛాలెంజ్ చేశారు.
ఇండిపెండెంట్ గా పోటీ చేస్తేనే నియోజకవర్గంలో ఎవరి సత్తా ఏమిటో తేలుతుందన్నారు. పోలీసులకు అడ్డం పెట్టుకుని కేసులు పెడతామని టీడీపీ శ్రేణులను భయపెట్టి ఎన్నికల్లో పోటీ లేకుండా చేసుకోవడాన్ని ఏమంటారో వారికే వదిలేస్తున్నామన్నారు.
శిఖండుల్లా అడ్డదారుల్లో కాకుండా మొనగాళ్లలా రహదారిలో ఎన్నికలకు రావాలని కోరారు. పార్టీ గుర్తు అడ్డం పెట్టుకుని ఎన్నికలల్లో అరాచకాలకు పాల్పడితే ఇక్కడ ఎవరూ చూస్తూ ఊరుకోరన్నారు. పార్టీ గుర్తు లేకుండా వైసీపీ నేతలు ఏ అర్థరాత్రి వచ్చినా తాము ఎన్నికలకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నామన్నారు.