ప్రభుత్వ వైఫల్యం కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయే పరిస్థితికి వచ్చిందని, టీడీపీ అధికారంలో ఉండి ఉంటే ఈ పాటికే పోలవరం పూర్తయి ఉండేదని కడప జిల్లా కు చెందిన టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి కామెంట్ చేశారు.
వైసీపీ అసమర్థత కారణంగా పోలవరంకు కేంద్రం నిధుల కేటాయింపులో వెనుకడుగు వేస్తోందని ఆయన అన్నారు. నిధులు కావాలని అడగటానికి వైసీపీ ఎంపీలకు నోరు రావడం లేదని, పోలవరం పూర్తి కాకపోతే రాయలసీమ ప్రాంతం పూర్తి ఎడారిగా మారుతుందని ఆయన అన్నారు.
హోదా విషయంలో ఢిల్లీ పెద్దల మెడలు వంచుతామన్న వైసీపీ నేతలు వారి వద్దే వంగి వంగి మెడలు వంచుతున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం నిధులు రాబట్టలేకపోతే రాయలసీమ ఎంపీలు రాజీనామా చేయాలని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.
వైసీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. గీతం, నారాయణ విద్యాసంస్థలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సిగ్గు చేటని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.