నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో టిడిపి నుంచి భారీ స్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి వలసలు ప్రారంభమయ్యాయి. చేజర్ల మండల పరిషత్ మాజీ అధ్యక్షులు తూర్పు కంభంపాడు గ్రామానికి చెందిన అన్నలూరు శ్రీనివాసులు నాయుడు, చేజర్ల మండల కన్వీనర్ తూమాటి విజయ భాస్కర్ రెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ బి.సి. కన్వీనర్ గోతం వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో నేడు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ సిఎం వై స్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, కుల, మత, ప్రాంత, వర్గ, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు.
అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అధికంగా మొగ్గు చూపుతున్నారని మంత్రి తెలిపారు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత కల్పిస్తామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించడం ఖాయమని మంత్రి పునరుద్ఘాటించారు.