తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టిఎస్పిటిఎ) రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శిగా రాత్లవత్ రోహిత్ నాయక్ ను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నాగనమోని చెన్నరాములు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం రాష్ట్ర కార్యవర్గం కాలపరిమితి 2021 జూన్ 30 తేదీన ముగిసే వరకు అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు.
ఆయన ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా పోచమ్మ గడ్డ తాండ ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు.
రోహిత్ నాయక్ గతంలో తెలంగాణ రీజనల్ టీచర్ యూనియన్ (టీఆర్టియూ) సంఘంలో మొదటగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆర్థిక శాఖ కార్యదర్శి గా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి గత సంవత్సరం ఆ సంఘానికి రాజీనామా చేసి తన మాతృసంస్థ అయిన టిఎస్పిటిఎ లో చేరి సేవలు అందిస్తున్నారు.
ఈ సందర్భంగా రాత్లవత్ రోహిత్ నాయక్ విలేకరులతో మాట్లాడుతూ, టిఎస్పిటిఎ గడిచిన ఏడు దశాబ్దాలుగా ప్రాథమిక ఉపాధ్యాయల సమస్యలు పరిష్కారం కోసం రాజీలేని వైఖరిని ప్రదర్శిస్తున్నందుకు ఆకర్షితుడినై ఈ సంఘంలో చేరినట్లు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని విశ్వాసాన్ని, వమ్ము చేయకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాథమిక ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు. సంఘం ప్రధాన లక్ష్యాలైన ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు, ఛటోపాధ్యాయ కమీషన్ సిఫార్సులను అనుసరించి మిగిలిన క్యాడర్ ల కంటే అధిక వేతనాలు సాధించడానికి నిర్విరామంగా కృషి చేస్తానని తెలిపారు.