దేశం నుంచి బిజెపిని కూకటివేళ్లతో పెకలించివేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి బోగస్ హామీలతో ఉన్నదని ఆయన అన్నారు.
భారతీయ జనతా పార్టీ పాలనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర పదజాలంతో దాడి చేశారు. కేంద్ర బడ్జెట్ లో కనీసం ఆరోగ్య రంగానికి కూడా కేటాయింపులు పెంచలేదని ఆయన అన్నారు. దేశంలో మతకలహాలు రేపడం తప్ప బిజెపికి మరేం చేతకాదని ఆయన అన్నారు.
రైతుల సమస్యలను పట్టించుకోలేదని ఆయన కేంద్ర బడ్జెట్ పై విమర్శలు గుప్పించారు. 2022 కల్లా రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారని అయిందా అని కేసీఆర్ ప్రశ్నించారు.
ఏ మాత్రం ముందు జాగ్రత్త లేకుండా దరిద్రపుగొట్టు బడ్జెట్ ను కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని ఆయన అన్నారు. దేశాన్ని తిరోగమన దిశగా తీసుకువెళుతున్న బిజెపిని బయటకు సాగనంపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు కార్యాచరణ కూడా ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.