కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సోనియా గాంధీ జన్మదినం సందర్బంగా మాజీ మంత్రిస్ షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా 500 మంది నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ చేపట్టారు.
అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తన జన్మదిన వేడుకలు సాదాసీదాగా జరపాలని సోనియా గాంధీ సూచించారని అన్నారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసిందని బీజేపీ నాయకులు పదేపదే ప్రశ్నిస్తున్నారని అన్నారు.
నేడు ప్రపంచంలో దేశం అత్యుత్తమ స్థాయిలో ఉండటానికి, తెలంగాణ ప్రజల చిరకాల కోరిక రాష్ట్ర సాధన కలను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.
ప్రయివేటీకరణకు కంకణం కట్టుకున్న మోడీ
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి మోడీ కంకణం కట్టుకున్నారని, ఆయన స్నేహితులకు, కార్పొరేట్ సంస్థలకు లాభాల్లో ఉన్న సంస్థలను అప్పగించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. రైతుల విషయంలో టిఆర్ఎస్ దొంగ నాటకాలు అడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన రైతుల విషయంలో మొసలి కన్నీరు కారుస్తుందన్నారు.
నేడు రెండు మూడు ఎన్నికలు కేసీఆర్ కు దిమ్మ తిరిగేలా చేశాయని తెలిపారు. అందుకే ఏ ప్రశ్నించే తత్వం వద్దన్నారో, ఏ ధర్నా చౌక్ లు ఎత్తేసారో, ఏ రాస్తారోకోలు లేకుండా చేశారో ఇప్పుడు అదే విధానాన్ని టిఆర్ఎస్ ఎంచుకుందని ఎద్దేవా చేశారు.
కల్వకుంట్ల కుటుంబంపై తీరని ఆగ్రహం
తనవరకు వస్తే తప్ప తెలియకపోవడం అంటే ఇదేనని, అందుకే ఊసర వెల్లిలా రంగులు మారుస్తున్నరని విమర్శించారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి మూడు కరణలున్నాయని షబ్బీర్ అలీ తెలిపారు. కల్వకుంట్ల కుటుంబంపై ఆవేశంతో ఉన్న ప్రజలు ఆ పార్టీని ఓడించాలని చూసారన్నారు.
కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నాయకులను కోట్లాది రూపాయలతో కొనుగోలు చేస్తూ కాంగ్రెస్ గెలిస్తే టిఆర్ఎస్ లోకి చేరుతారన్న ఆలోచన ప్రజల్లో కల్పించారని తెలిపారు. మా గొంతు నొక్కి మాట్లాడే అవకాశం లేకుండా చేశారనే వాపోయారు.
ఎన్నికల్లో టిఆర్ఎస్, బీజేపీ పార్టీలు డబ్బు కట్టలు వెదజల్లారని, లిక్కర్ ఏరులై పారిందని తెలిపారు. పిసిసి ఎన్నికపై అధిష్టానం అభిప్రాయ సేకరణ చేస్తుందని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.