తొడ గొడతాం… టీఆర్ఎస్ ను పడగొడతాం అంటూ బీరాలు పలికిన బిజెపి, నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నిలబెట్టిన క్యాండిడేటు ఒకనాటి జానారెడ్డి శిష్యుడే. చాలా సంవత్సరాలుగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బిజెపికి అండగా నిలబడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంకనాల నివేదితా రెడ్డి ని కాదని జానారెడ్డి శిష్యుడికి బిజెపి టిక్కెట్ ఇచ్చింది.
కంకనాల నివేదితారెడ్డి బిజెపికి ఎంతో సేవ చేశారు. కమ్యూనిస్టుల కోట అయిన నల్గొండ జిల్లాలో బిజెపి ఓట్లు సంపాదించడం చాలా కష్టమైన పనే. అదీ కూడా ఒక వైపు జానారెడ్డి లాంటి సీనియర్, బలమైన టీఆర్ ఎస్ పార్టీ ఉండగా బిజెపి గెలవడం సాధ్యం అయ్యే పని కాదు.
అయితే నాగార్జున సాగర్ లో నివేదితా రెడ్డి కుటుంబం బిజెపికి అండగా నిలబడ్డది. ఆర్ధికంగా ఎన్నో ఓడిదుడుకులను ఎదుర్కొంటూ కూడా బిజెపి జెండాను అక్కడ ఎగరేసేందుకు నివేదితారెడ్డి కుటుంబం ప్రయత్నిస్తున్నది.
నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుందని ఎవరూ ఊహించలేదు. అలాంటిది ఉప ఎన్నిక వచ్చింది. నియోజకవర్గంలో పని చేస్తున్న వారిని కాదని వేరే వారికి టిక్కెట్ ఎలా ఇస్తారు? కాంగ్రెస్ తరహా ఇలాంటి రాజకీయాలు బిజెపిలో కూడా జరగడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.
కులపరమైన అడ్డంకులు వస్తాయనుకుంటే కడారి అంజయ్య కు టిక్కెట్ ఇచ్చినా బాగుండేది. అలాంటిది డాక్టర్ పానుగోతు రవికుమార్ ను బిజెపి తన అభ్యర్ధిగా ఎంపిక చేసుకున్నది. ప్రభుత్వ వైద్యుడుగా పని చేసిన రవికుమార్ ను బిజెపి అభ్యర్ధి గా ఎంపిక చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకున్నది.