తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అధికారుల పని కాదని, ప్రభుత్వ పెద్దల పనేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. అధికారికంగా కాకుండా ప్రయివేటు ఏజెన్సీతో టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే వాదన వినిపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చేస్తున్న ఈ వ్యాఖ్యలు మరింత సంచలనం కలిగిస్తున్నాయి.
అధికారికంగా ఇంటెలిజెన్సు అధికారులతో కచ్చితమైన అనుమతులు తీసుకుని కాకుండా ప్రయివేటు ఏజెన్సీలు టెలిఫోన్ లు ట్యాపింగ్ చేయడం అది పెద్ద నేరం అవుతుంది. ఇదే విషయాన్ని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆరోపణలు ధృవీకరిస్తున్నాయి. ‘‘మంత్రులు, సలహాదారులు ఒక్కడిని చేసి మూకుమ్మడి దాడులు చేస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో అనేక రకాలుగా విషప్రచారం చేస్తున్నారు. నేరాలు చేసిన వ్యక్తులే తాము నిరూపిస్తామని చెబుతున్నారు. నేను చివరి వరకు పార్టీలో ఉండి మోసం చేయలేదు. నామినేషన్లకు ముందు రోజు మోసం చేస్తే తప్పు. నా తమ్ముడు అనిల్ కుమార్ వ్యాఖ్యలు బాధించాయి. నేను తప్పు చేస్తే సర్వనాశనం చేయాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.