రాష్ట్ర ప్రజల్ని ఉగాది పండుగ చేసుకోనీయకుండా జగన్ రెడ్డి వారి జీవితాల్లో చీకట్లు నింపారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా ఈనెల 2వతేదీ ఉగాది నుంచి వారం రోజుల పాటు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన కొవ్వొత్తులతో నిరసన చేపట్టాలని నిర్ణయించామని ఆయన వెల్లడించారు.
ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి కొవ్వొత్తి-అగ్గిపెట్టెలను పంపిణీ చేస్తారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన విద్యుత్ ఛార్జీల పెంపుతో జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజల జీవితాల్లో చీకట్లు నింపుతారని ఎవరూ ఊహించి ఉండరు. కొత్త సంవత్సరం రోజున ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాల్సిన తరుణంలో ప్రజలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితిని జగన్ రెడ్డి కల్పించారని ఆయన అన్నారు.
కోతలు, వాతలతో జగన్ రెడ్డి ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నారని ఆయన తెలిపారు. జగన్ రెడ్డి మోపిన విద్యుత్ ఛార్జీల పెనుభారంతో ప్రజలు ఇళ్లలో కరెంటు స్వీచ్ వేయాలంటేనే వణికిపోతున్నారని, ప్రజల్ని చీకట్లోకి నెట్టిన జగన్ రెడ్డి, జే-గ్యాంగ్ కుటుంబాలు మాత్రం అవినీతి సొమ్ముతో కళకళలాడుతున్నాయని అచ్చెన్నాయుడు అన్నారు.
చీకట్లలో ఉన్న ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వారి తరపున ప్రజాక్షేత్రంలో పోరాడాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిందని, జగన్ రెడ్డి మెడలు వంచి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు వివిధ రూపాల్లో ఉద్యమం కొనసాగుతుందని ఆయన చెప్పారు.