పేదలకు శాశ్వత నివాస యోగ్యం కల్పించి, వారి ఆత్మగౌరవం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.ఖమ్మం నగరం 17వ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలవకట్టపై నివాసం ఉంటున్న పేదలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 58&59 ద్వారా మంజూరైన పట్టాలను బృందావనం గార్డెన్స్ నందు మంత్రి పువ్వాడ లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మేలు చేసేందుకు తీసుకొచ్చిన జి.ఓనెం.58, 59 పథకం క్రింద ఖమ్మం నగరంలో ప్రభుత్వ స్థలంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసాలకు వారికి పూర్తి హక్కు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం లోనే మొదటిగా జి.ఓనెం. 58, 59 పథకం క్రింద పెద్ద ఎత్తున పట్టాలు సిద్దం చేసి మునుపెన్నడూ లేని విధంగా ఈ పథకం ద్వారా శాశ్వత ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసిందన్నారు.
ఈ పథకం ద్వారా ఖమ్మం నగరంలో 2800 మందికి ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి అక్కడే స్థిర నివాసం ఉండేందుకు హక్కు పత్రాన్ని కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఅర్ ది అన్నారు.గడువు ముగిసినప్పటికీ మంత్రుల విజ్ఞప్తి మేరకు ఈ నెల మళ్ళీ పొడిగించడం జరిగిందని, మిగిలి ఉన్న వారు ధరఖాస్తు చేసుకోవాలని మళ్ళీ ఇలాంటి అవకాశం రాదని స్పష్టం చేశారు.ఒకే సారి డివిజన్ లో ఇంత పెద్ద ఎత్తున పేదలకు పట్టాలు ఇవ్వడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నరు.
వేల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేయొచ్చు గాకా… కానీ పేదలకు శాశ్వత నివాసం కల్పిస్తూ ఇలాంటి పనులు చేయడం ద్వారా జీవితానికి ఒక సంతృప్తిని ఇస్తుందన్నారు.ఒకప్పుడు ఖమ్మం నేడు ఖమ్మం ఎలా ఉంది.. కనీసం ప్రయాణించడానికి రోడ్లు సరిగా లేక, విద్యుత్ దీపాలు లేక, త్రాగునీరు లేక, అధ్వానంగా ఉన్న సైడుకాల్వలు ఇలాంటి మరెన్నో సమస్యల నుండి నేడు ఖమ్మం నగరంలో హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి తరహాలో రూ.180 కోట్లతో నగరంలో మున్నేరు పై కేబుల్ బ్రిడ్జి త్వరలో కట్టుకోబోతున్నమని గుర్తు చేశారు.
ఇది ఎవరైనా ఊహించి ఉంటారా… అని అన్నారు.ఇన్ని చేస్తున్న ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలని మళ్ళీ ముఖ్యమంత్రి గా కేసీఅర్ నే గెలిపించుకోవాలని అన్నారు.