ప్రజలకు చిత్తశుద్ధితో సేవలందిస్తున్న వార్డు వలంటీర్లను క్రిమినల్స్ గా చిత్రీకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని రైల్వే కోడూరు మండల వాలంటీర్లు హెచ్చరించారు.మంగళవారం ఉదయం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణ టోల్గేట్ నందు పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
పవన్ కళ్యాణ్ చిత్రంపై చెప్పులతో కొడుతూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ప్యాకేజీ స్టార్ డౌన్ డౌన్, పావలా స్టార్ డౌన్ డౌన్.. నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా పలువురు వార్డు వాలంటీర్లు మీడియాతో మాట్లాడుతూ వార్డు వాలంటీర్లకు సమున్నత స్థానాన్ని సీఎం జగన్ ఇచ్చారని, ప్రజాప్రతినిధుల కంటే మాకే ఎక్కువ విలువ ఇచ్చారని అన్నారు.
వార్డు వాలంటీర్లు అంటే సీఎం జగనన్నకు మానస పుత్రికలు వంటి వారమని.. అటువంటి మా వలంటీర్ల వలనే రాష్ట్రంలో కొన్ని వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని ఆరోపణలు పవన్ కళ్యాణ్ ఏ ఆధారాలతో చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నోటికి ఏమొస్తే అది ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని..
బేషరతుగా క్షమాపణలు చెప్పకుంటే చెప్పెట్టుకుని కొడతామని ఘాటుగా హెచ్చరించారు. నీ దగ్గర రెండు చెప్పులే ఉండొచ్చు.. రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది వార్డు వాలంటీర్లు చెప్పులు చూపెడితే నామ రూపాలు కూడా ఉండవంటూ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు మండల రూరల్, పట్టణంలోని వందలాది గ్రామ, సచివాలయ వార్డు వాలంటీర్ల తదితరులు పాల్గొన్నారు.