మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే సంవత్సరం నుండి దేవరగట్టు పరిసరాలలో జరిగేందుకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ రంజిత్ కుమార్ తెలిపారు. సోమవారం మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న రంజిత్ కుమార్ కు దేవాలయ చైర్మన్ ప్రహల్లాదరావు అర్చకులు పూజలు నిర్వహించి దేవాలయ చరిత్రతో పాటు దేవరగట్టు ప్రాశస్త్యం గురించి ఆయనకు వివరించారు. దేవరగట్టు స్వామివారి మొదట కాలుమోపిన ప్రాంతమని ఇక్కడ శేషదాసులు తపమాచరించి ఆంజనేయ స్వామిని ప్రతిష్టించారని తెలిపారు.
వేసవిలోనూ నీరు ఇంకిపోకుండా ఉండే మానస సరోవరం దేవరగట్టు పైన ఉన్నదని పవిత్రమైన అట్టి ప్రాంతాన్ని జాతరకు అనుకూలంగా మార్చడానికి సహాయ సహకారాలు అందించాలని రంజిత్ కుమార్ ను కోరారు. ప్రస్తుతం దేవాలయ పరిసరాలలో భక్తులు దాసంగాలు సమర్పించుకుంటున్నారని దీంతో ఇబ్బందిగా ఉన్నందున విశాలంగా ఉన్న దేవరగట్టు ప్రాంతానికి దాసంగాలను పెట్టుకోవడానికి మార్చాలని ప్రతిపాదన ఉన్నదని ప్రహ్లాద రావు తెలిపారు.
దేవరగట్టు సమీపంలోని 86 ఎకరాలు దేవాదాయ భూమి ఉన్నదని అట్టి ప్రాంతంలో రోడ్డు ఇతర సదుపాయాలు కల్పిస్తే వచ్చే సంవత్సరం జాతర దేవరగట్టు పరిసరాలలో నిర్వహించవచ్చని తెలిపారు. ఇందుకు తాము స్వామి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని రంజిత్ కుమార్ ప్రహల్లాద రావుకు తెలిపారు.