స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడానికి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా రూపకల్పన పై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు నమోదుకు ఈ నెల 19 వరకు గడువు ఉన్నట్లు, అర్హులైన ప్రతిఒక్కరు ఓటుహక్కు పొందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
గత నెల 26, 27, ఈ నెల 2,3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యాచరణ చేపట్టి, ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ లెవల్ అధికారులను, ఫారం-6,7,8 లతో అందుబాటులో ఉంచి కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. అట్టి ప్రత్యేక కార్యాచరణ లో ఫారం-6 క్రింద 12084, ఫారం-7 క్రింద 3044, ఫారం-8 క్రింద 4359 దరఖాస్తులు అందినట్లు ఆయన అన్నారు.
బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఫారం 6, 7, 8 ద్వారా వచ్చిన దరఖాస్తులపై విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు సైతం బూత్ స్థాయి అధికారులకు సహకరిస్తూ స్పష్టమైన జాబితా రూపొందించడానికి సహకరించాలని ఆయన అన్నారు.
జాబితా పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తేవాలని ఆయన తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ప్రతి బుధవారం, జిల్లా స్థాయిలో ప్రతి గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రముఖుల ఓట్లు జాబితాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఏర్పాటుచేసిన ఇవిఎం డిమాన్ స్ట్రేషన్ కేంద్రాలను ఇప్పటివరకు 12478 మంది సందర్శించినట్లు, 11630 మంది మాక్ ఓట్ వేసినట్లు ఆయన తెలిపారు.
జిల్లాలో మొబైల్ డిమాన్ స్ట్రేషన్ వాహనాలు 822 పోలింగ్ కేంద్రాలలో ప్రచారం చేపట్టి, ప్రజల్లో ఓటుహక్కు గురించి, ఇవిఎం ల ద్వారా ఓటు వేసే విధానం గురించి అవగాహన కల్పించినట్లు ఆయన అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, కలెక్టరేట్ ఎలక్షన్ డిటి అన్సారీ, ఆప్ పార్టీ ప్రతినిధులు ఎన్. తిరుమల రావు, పి.
శ్రీనివాస్, సీపీఐ పార్టీ ప్రతినిధి పి. వెంకటేశ్వరరావు, ఐఎన్ సి ప్రతినిధి ఎన్. సత్యం బాబు, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి ఎల్. సతీష్, టిడిపి ప్రతినిధులు కె. కరుణాకర్, పిటిఆర్. కృష్ణప్రసాద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.